న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అక్కడ తరచూ ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉన్నాయి. దారి దోపిడీలు, బ్యాంక్ రాబరీలు, ఇంట్లో చొరబడి దొంగతనాలు, దుకాణాల్లోకి దూరి కౌంటర్లలో డబ్బులు ఎత్తుకెళ్లడాలు ఢిల్లీలో పరిపాటిగా మారాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
గత గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కనగల దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వీడియోలో ఏముందంటే.. గత గురువారం రాత్రి 8.45 గంటలప్పుడు రోహిణి ఏరియాలో ఓ యువకుడు రోడ్డు వెంటగల ఒక డ్రై ఫ్రూట్స్ దుకాణంలో నిలబడి ఫోన్ చూసుకుంటున్నాడు. అదే సమయంలో ఓ మహిళ షాప్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది. సరిగ్గా అప్పుడే బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేశారు.
మహిళ అరుపులు విన్న షాపులోని యువకుడు బయటికి పరుగులు తీసి గొలుసు లాక్కోబోతున్న దుండగుడిని అడ్డుకోబోయాడు. కానీ దుండగుడు తుపాకీ తీసి బెదిరించడంతో భయంతో షాపులోకి పరుగుతీశాడు. దుండగుడు మళ్లీ మహిళపై పడి గొలుసు తెంచుకుని బైక్పై వేచి ఉన్న మరో దుండగుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కింది వీడియోలో ఆ దృశ్యాలు మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Two bike-borne men snatched chain from a woman at gunpoint, in Delhi’s Rohini area on April 13; police investigation underway: Delhi Police
(Source: CCTV footage) pic.twitter.com/L2xR72NIvR
— ANI (@ANI) April 15, 2023