రోజూ నదిలో చేపలు పట్టుకోవడానికి వాళ్లంతా కలిసే వెళ్తారు. ఒకరికి ఒకరు మంచి పరిచయమే. కానీ ఒక చిన్న అనుమానం వారి మధ్య చిచ్చుపెట్టింది. అందరూ కలిసి ఒక వ్యక్తిని దొంగను చేసి చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో వెలుగు చూసింది. ఇక్కడ కొందరు జాలరులు రోజూ చేపలు పట్టేందుకు వెళ్తుంటారు.
వీరిలో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ పోయింది. దాన్ని ఈ బృందంలోని ఒక జాలరి తీశాడని మిగతా వాళ్లు ఆరోపించారు. తనకు ఎటువంటి పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న మిగతా వాళ్లు.. అతన్ని ఒక పడవపై తలకిందులుగా వేలాడగట్టారు.
ఆపై కొట్టి దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో వేలాడుతున్న వ్యక్తి, తనదేమీ తప్పులేదంటూ కాళ్లకు కట్టిన తాడును విప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మిగతా సహచరులందరూ అతని చుట్టూ నిలబడి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.