డెహ్రాడూన్: అగ్నివీర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సత్పులి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సుమిత్ కుమార్, బుధవారం కోత్వార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం సాయంత్రం నౌగావ్ కమండ గ్రామంలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదస్పద నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతి నియామక ‘అగ్నివీర్’ పరీక్షలో పాస్ కాకపోవడంతో అతడు మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి సుమత్ మృతదేహాన్ని పరిశీలించారు. అతడు గత నాలుగేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 23 ఏళ్లు రావడంతో అతడికి ఇదే చివరి అవకాశమని చెప్పారు. ఈ నేపథ్యంలో అగ్నివీర్ పరీక్షలో పాస్ కాలేకపోవడంతో మనస్తాపంతో సుమిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపారు.
దీంతో పోస్ట్మార్టం కోసం సుమిత్ కుమార్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.