లక్నో : ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఒక రోజంతా ఇంట్లోనే శవాన్ని ఉంచాడు. మరునాడు తన పొలంలో శవాన్ని పూడ్చి.. 30 కిలోల ఉప్పును చల్లాడు. ఇతరులకు ఎవరికీ అనుమానం రాకుండా భార్య సమాధిపై పంట పండించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్కు చెందిన దినేశ్ కూరగాయల వ్యాపారి. ఆయనకు ఒక భార్య ఉంది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు దినేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జనవరి 25వ తేదీన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అదే రోజు ఆమెను భర్త చంపేశాడు. శవాన్ని ఒకరోజు మొత్తం ఇంట్లోనే ఉంచారు. మరుసటి రోజు తన పొలంలోనే శవాన్ని పూడ్చి పెట్టాడు. శవం త్వరగా కుళ్లిపోవాలనే ఉద్దేశంతో 30 కిలోల ఉప్పు చల్లాడు. ఆ తర్వాత పూర్తిగా మట్టి కప్పి.. సమాధిపై పంట పండించాడు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు.
కొద్ది రోజుల తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దినేశ్పైనే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆయనను లోతుగా విచారించగా, తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో చంపినట్లు దినేశ్ అంగీకరించాడు. దినేశ్ సమాచారంతో పొలంలో పాతిపెట్టిన భార్య మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.