సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : ఓ పేరొందిన కాలేజీ తమ విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా హఠాత్తుగా ఓ అగంతకుడు చొరబడి.. ఓ విద్యార్థినిని రేప్ చేస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ టీచర్ వరస్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా నాచారంలోని ఓ కాలేజీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. దీంతో జూమ్ క్లాస్కు సంబంధించిన పాస్వర్డ్ను విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం ఇచ్చింది. ఇక క్లాస్లు నిర్వహిస్తున్న క్రమంలో ఒక రోజు గుర్తు తెలియని వ్యక్తి.. ఆన్లైన్లోకి ప్రవేశించారు. ఓ విద్యార్థిని పేరును పేర్కొంటూ.. ఆమెను రేప్ చేస్తానని బెదిరించాడు. ఆ యువతికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. ఆ మరుసటి రోజే కాలేజీ యాజమాన్యం పాస్ వర్డ్ను మార్చేసింది.
పాస్వర్డ్ మార్చినప్పటికీ అగంతకుడు ఆగలేదు. మళ్లీ వారి ఆన్లైన్ క్లాసుల్లో చొరబడ్డాడు. కాలేజీ టీచర్ జీమెయిల్ను హ్యాక్ చేసి.. దాన్నుంచి పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. ఆ టీచర్ వరస్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు. ఈ క్రమంలో కాలేజీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఆ అగంతకుడు ప్రవర్తిస్తుండటంతో.. కళాశాల యాజమాన్యం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.