హయత్నగర్ : ఎలాంటి అనుమతులు పొందకుండానే కొనసాగిస్తున్న ఓ గోడౌన్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలో స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఫెస్టిసైడ్స్ను గత నాలుగు నెలలుగా ఓ గౌడౌన్లో ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్వాహకులు నిల్వ ఉంచుతున్నారని పెద్దఅంబర్పేట మున్సిపల్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో హయత్నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అర్పివేసేందుకు ప్రయత్నించారు. సాయంత్రానికి కూడా గోడౌన్లో చెలరేగుతున్న మంటలు అదుపులోకి రాలేదు. జేసీబీల సహాయంతో ఫెస్టిసైడ్స్ను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దట్టమైన మంటలు వ్యాపించి స్థానికంగా పొగలు అలుముకోవడంతో అక్కడ ఏమి జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రూ. 5 నుండి 10 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
గోడౌన్ నిర్వాహకులు ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లనే షార్ట్ సర్క్యూట్కు గురై అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంటలు చెలరేగుతున్న సమయంలోనే హడావుడిగా కంపెనీ పేరుతో కూడిన ఫ్లెక్సీని గోడౌన్ బయట ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.