ముంబై : నాలుగేండ్లుగా వివాహితపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారనే అభియోగాలపై కొరేగావ్కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని వీడియో తీశారని వివాహిత (42) ఫిర్యాదుపై పోలీసులు సత్వరం స్పందించారు. నిందితులను కొరేగావ్కు చెందిన స్వర్ణకారుడు భరత్ గాంధీ, పప్పుధాన్యాల వ్యాపారి దిలీప్ ఓశ్వాల్గా గుర్తించారు.
బాధితురాలికి నిందితులు పరిచయస్తులని, భర్తతో ఆమెకు విభేదాలున్నాయనే విషయం తెలుసని పోలీసులు చెప్పారు. కొరేగావ్ పార్క్ ప్రాంతంలో నివసించే బాధితురాలు ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. భర్తతో మహిళకున్న విభేదాలను అవకాశంగా తీసుకుని ఇద్దరు వ్యాపారులు 2018 నుంచి బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారు.
పలు హోటళ్లతో పాటు నిందితులు వారి కార్యాలయాల్లో, శుక్రవార్పేట్లోని ఫ్లాట్లోనూ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మహిళపై లైంగిక దాడుల ఘటనలను కెమెరాలో రికార్డు చేశాడని వీరిపై ఐటి చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.