జైపూర్ : ఇద్దరు సోదరులను పదిహేను రోజుల కిందట పెండ్లి చేసుకున్న ఇద్దరు నవ వధువులు అత్తింటి నుంచి రూ ఏడు లక్షల నగదు, బంగారంతో ఉడాయించిన ఘటన రాజస్ధాన్లోని భరత్పూర్లో వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను ప్రీతి, చాందినిగా గుర్తించారు. పెండ్లి కొడుకుల్లో ఒకరైన రాజేష్ కుమార్ శర్మ ఫిర్యాదుపై యూపీలోని ఫిరోజాబాద్, మొయిన్పురిలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పెండ్లి జరిపించిన ఏజెంట్ కుల్ధీప్ జాదవ్ను కూడా అరెస్ట్ చేశారు.
మహిళలకు రోజుకు రూ 2000 చొప్పున చెల్లిస్తానని వారితో ఒప్పందం చేసుకుని పెండ్లి తంతు జరిపించానని ఏజెంట్ పోలీసులతో చెప్పాడు. వయసు మీదపడి పెండ్లి కాని వారిని టార్గెట్ చేస్తూ వారికి సంబంధాలు చూస్తామని డబ్బు దండుకునే ముఠాలో కుల్దీప్ జాదవ్ పనిచేస్తున్నాడు. ఇలాంటి వారికి తాము ముందుగా మాట్లాడుకున్న మహిళలతో పెండ్లి తంతు జరిపించి ఆపై అత్తింట్లో సొమ్ముతో ఉడాయించడమే పనిగా పెట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్ధాన్లోని బైసోరా గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ శర్మ, ఆయన సోదరుడు రామేశ్వర్ శర్మకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న యూపీలోని ఫిరోజాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రీతి, చాందినిలతో వివాహం జరిగింది. తనకు రూ 7 లక్షలు ఇస్తే సోదరులిద్దరికీ యూపీకి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లతో వివాహం జరిపిస్తానని శర్మ సోదరుల తల్లి కమలాదేవిని ఏజెంట్ జాదవ్ నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆమె ఆ మొత్తం జాదవ్కు అందించింది. వివాహం జరిగిన 15 రోజుల తర్వాత అత్తింటి నుంచి విలువైన ఆభరణాలు, నగదుతో అక్కాచెల్లెళ్లు ఉడాయించారు.