హైదరాబాద్ : ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు నాటి ఏఎస్సీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్ని రకాల ఆధారాలను సేకరించి, కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగ్రామ్ సింగ్ జి పాటిల్ను ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. పాటిల్తో ఆయన బృందాన్ని సజ్జనార్ సత్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకున్నందుకు పాటిల్ను సజ్జనార్ అభినందించారు. పిల్లలకు సంబంధించిన నేరాలలో నిందితులకు శిక్ష విధించడం ఇప్పుడు సవాలుగా మారింది. కానీ, దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష పడడం చారిత్రాత్మకం అని సజ్జనార్ పేర్కొన్నారు.