AP News | ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు యువకులు దుర్మార్గంగా ప్రవర్తించారు. పీకల దాకా మద్యం తాగించి, ఆ తర్వాత ముఖంపై మూత్రం పోసి హింసించారు. అంతేకాదు.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో నెల రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన మోట నవీన్(గిరిజన యువకుడు), మన్నే రామాంజనేయులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ జులాయిగా తిరుగుతూ.. పలు నేరాలకు పాల్పడ్డారు. వీరిద్దరిపై 50 కేసులు నమోదు అయ్యాయి. నవీన్ పోలీసులకు చిక్కగా, రామాంజనేయులు తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే నవీన్, రామాంజనేయులు మధ్య గతంలో ఓ అమ్మాయి విషయంలో వివాదం జరిగింది. ఆ వివాదం తాజాగా మరోసారి ఇరువురి మధ్య దూరాన్ని పెంచింది.
అయితే మద్యం తాగుదామని నవీన్కు రామాంజనేయులు చెప్పాడు. దీంతో మిగతా స్నేహితులతో కలిసి నవీన్, రామాంజనేయులు కలిసి మద్యం తాగేందుకు వెళ్లారు. పీకల దాకా మద్యం సేవించిన తర్వాత వారిద్దరి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. మాటకు మాట పెరిగి.. కొట్టుకునే దాకా వచ్చింది. నవీన్ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నవీన్ స్పృహ కోల్పోవడంతో అతని నోట్లో ముగ్గురు యువకులు కలిసి మూత్రం పోశారు. ఆ తర్వాత మర్మాంగాన్ని బలవంతంగా నోట్లో పెట్టేందుకు యత్నించారు.
ఈ దృశ్యాలు ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితులను మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. పోలీసుల వ్యవహారంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.