భద్రాద్రి కొత్తగూడెం : నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను, హరిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇద్దరు కుమారులను ఇంట్లో నాయనమ్మ వద్ద ఉంచి భార్యభర్తలు ఇరువురు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నాయనమ్మ వద్ద ఇంట్లో ఉన్న రిషి కుమార్(2) ఆడుకుంటూ వెళ్లి ఇంటి ప్రాంగణంలో ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. ఇంట్లో పనిలో నిమగ్నమైన నాయనమ్మ కొంతసేపటి తర్వాత పిల్లవాడు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ వెతుకుతుండగా నీటి తొట్టిలో విగతజీవిగా బాలుడు కనిపించాడు.
నీటి తొట్టెలో నుంచి బాబుని బయటకు తీసి స్థానిక వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లగా అప్పటికే బాబు మృతి చెందినట్లు తెలపడంతో కుటుంబ సభ్యులంతా గుండె పగిలేలా రోదించారు. చిన్నారి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.