Tragedy | వాంకిడి : నిన్ననే నిశ్చితార్థం జరిగింది. తన జీవితంలోకి ప్రవేశించబోయే భాగస్వామి గురించి రాత్రంతా కలలు కన్నాడు.. పెళ్లి జీవితాన్ని ఊహించుకున్నాడు. ఆనందమయ జీవితం కోసం తను, నేను అడుగులు వేయాలని ఆకాశంలో విహరిస్తూ ఆసిఫాబాద్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ అంతలోనే ఆ యువకుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించాడన్న విషయం తెలుసుకొని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామంలో చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళితే. సామెల గ్రామానికి చెందిన వసాకే తులసీరాం (26)కు బుధవారం అదే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్చి నిశ్చయమైంది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పనిపై బైక్పై ఆసిఫాబాద్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ కంపెనీకి చెందిన టిప్పర్ వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయంకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ విషయాన్ని గమనించిన పలువురు.. సంఘటనా స్థలం నుంచే ఫోన్ ద్వారా తండ్రి వసాకే భీంరావు (46)కు సమాచారం అందించారు. కొడుకు మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేని తండ్రి భీంరావు ఇంట్లో పురుగుల మందుతాగాడు. స్థానికులు గమనించి అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తులసీరాం మృతి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవడంపై పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. కంపెనీకి ప్రతినిధి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గంటల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్ తెలిపారు.