సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చిలుముల రాజు, సీసీసీ నస్పూర్కు చెందిన రేగుంట గౌతమిని 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు పుట్టిన తర్వాత భార్య పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె అత్తగారింటికి వెళ్లలేదు. గౌతమి తల్లిదండ్రుల వద్ద బాబు ఉంటుండగా, గౌతమి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. చిలుముల రాజు తండ్రి ఆరోగ్య బాగా లేకపోవడంతో మనువడిని చూడాలని కోరడంతో ఆయన అత్తగారింటికి వచ్చాడు.
తన భార్యను కాపురానికి పంపించాలని, ప్రస్తుతం కొడుకును తనతో తీసుకెళ్తానని చెప్పడంతో అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆయన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాతో సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి గంట సేపు హల్చల్ చేశాడు. సమాచారం తెలుసుకున్న సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని బాధితుడితో మాట్లాడి నచ్చజెప్పి కిందకు దించడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.