దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నూనావత్ తండాకు చెందిన గేరి కిషన్(35) తన ఇద్దరు కుమారులైన హర్షవర్దన్(8) అఖిల్(6)లకు కూల్ డ్రింక్ లో పురుగులమందు కలిపి తాగించాడు. వాళ్లిద్దరూ చనిపోయిన తర్వాత తానూ చెట్టుకు ఉరివేసుకొని బలవర్మణానికి పాల్పడ్డాడు.
నూనావత్ తండాకు చెందిన కిషన్ అదే తండాకు చెందిన భూలక్ష్మీతో గత పదేండ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం వారి జీవనం సజావుగా సాగింది. కిషన్ కొన్నాళ్లుగా తన ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. పిల్లలు కొండ్రపోల్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. గురువారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తిరిగి రాగానే వారికి బట్టలు, తినుబండారాలు కొనిస్తానని తండ్రి బయటకు తీసుకెళ్లాడు.
ముగ్గురు ఎంతసేపటికీ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లు వెతికినా కనిపించలేదు. ఉదయం పొలం వద్ద ముగ్గురు మృతదేహాలను చూసిన తండా వాసులు సమాచారం అందించారు. సంఘటనా స్థలం వద్ద మజా బాటిల్ ఉంది. కిషన్ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాడపల్లి ఇంచార్జీ ఎస్ఐ వీరశేఖర్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ దవాఖానకు తరలించారు. మృతుడు కిషన్ తల్లి నాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.