బెంగళూరు: ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకు ఏటీఎం చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ నెల 14 అర్ధ రాత్రి తర్వాత గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోలేదు. మరోవైపు గ్యాస్ కట్టర్ మంటలకు ఏటీఎంలోని రూ.19 లక్షల విలువైన కరెన్సీ నోట్లు కాలిపోయాయి.
దీంతో ఆ ఏటీఎంను నిర్వహించే సెక్యూరిటీ సంస్థ వారం రోజులు ఆలస్యంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఏటీఎంలో రూ.19.65 లక్షల విలువైన సుమారు 6,000 కరెన్సీ నోట్లు ఉన్నట్లు తెలిపింది. రూ.100 నోట్లు 2,965, రూ.200 నోట్లు 1,911, రూ.500 నోట్లు 2,573 ఉన్నట్లు చెప్పింది. దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచే ప్రయత్నంలో ఈ నోట్లు కాలి ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. లీగల్ టీంతో సంప్రదింపుల నేపథ్యంలో ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయినట్లు ఆ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
కాగా, బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ సంస్థ సీసీటీవీ ఫుటేజ్ను ఇంకా తమకు అందజేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. దీని కోసం ఆ సంస్థ నుంచి స్పష్టత కోరినట్లు చెప్పారు.