కందుకూరు : రోడ్డుపై నిలిచిన నీరు, డ్రైవరు అజాగ్రత్త, అతివేగం మూలంగా కారు అదుపు తప్పి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టి తీవ్ర నష్టం కలిగించింది. ప్రమాదానికి కారణమైన కారులోని గాలి బుడగలు ( ఏయిర్ బ్యాగ్స్ ) తెరుచుకోవడంతో కారులో ఉన్నయువతితో పాటు మరో ముగ్గురు యువకులకు పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున హైదరాబాదు, శ్రీశైలం జాతీయ రహదారిపై మండల కేంద్రంలో జరిగింది. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన దాచెపల్లి శ్రీనివాస్ శ్రీశైలం హైదరాబాదు, జాతీయ రహదారి పక్కన ఇళ్లు నిర్మించుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.
తన యాక్టీవా కారును ఇంటి ముందు పార్కింగ్ చేసి నిద్రిస్తున్నారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో ఇంటి ముందు భారీ శబ్ధం రావడంతో స్థానికులు వచ్చి చూడగా హైదరాబాదు నుండి కడ్తాల్ వైపు వెలుతున్న ఐ 20 కారు శ్రీనివాస్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారుతో పాటు స్కూటీని బలంగా ఢీ కొట్టడంతో రెండు కార్లు స్కూటీ పూర్తిగా ధ్వంస మయ్యాయి.
ఈ సమయంలో ఏయిర్ బ్యాగ్స్ తెచురుకోవడంతో కారులో ఉన్న నలుగురికి ప్రమాదం తప్పింది. కారును ఢీ కొట్టిన వ్యక్తులు కారును అక్కడే వదిలి వెల్లిపోయారు. రోడ్డుపై నిలిచి ఉన్న నీటి వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.