జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్తతో గొడవపడిన అల్లుడు ఆమెను దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన రాజవ్వకు ఇద్దరు కూతుళ్లు మంజుల, మోనిక ఉన్నారు. భర్త కొమురయ్య గతంలో మరణించగా ఇద్దరి కుమార్తెలకు వివాహాలు చేసింది.
చిన్న కుమార్తె మోనికను కథలపూర్ మండలం బొమ్మేన గ్రామానికి చెందిన మేనల్లుడు ఔరగొండ గంగాధర్కు ఇచ్చి నాలుగేండ్ల క్రితం వివాహం జరిపించింది. కాగా, గత కొన్ని రోజులుగా అల్లుడితో గొడవలు జరుగడంతో మోనిక తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం గంగాధర్ అత్తగారింటికి చేరుకొని మోనికను కాపురానికి పంపాలని గొడవకు దిగాడు.
ఆవేశంలో పక్కనే ఉన్న కర్రతో రాజవ్వను అల్లుడు గంగాధర్ తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మాల్యాల సీఐ రమణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.