మన్సూరాబాద్, నవంబర్ 21 : ఈనెల 18న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్స్నాచింగ్ కేసును పోలీసులు చేదించారు. ఇష్టపడి కొనుగోలు చేసిన బైకును ఫైనాన్సర్ల బారి నుంచి కాపాడుకునేందుకు సదరు యువకుడు చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితుడితో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, రావూరు గ్రామానికి చెందిన జివ్విగుంట శివప్రసాద్ అలియాస్ శివ (21) ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి వనస్థలిపురం, వెంకటరమణ కాలనీలో నివాసముంటున్నాడు.
మేస్త్రీ పని చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం రూ. 2.10 లక్షలతో బజాజ్ పల్సర్ బైకును కొనుగోలు చేశాడు.
మూడు నెలల నుంచి బైకు ఈఎంఐలు కట్టడం లేదు. ఇష్టపడి కొనుగోలు చేసిన బైకు ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్సర్లు వచ్చి బైకు తీసుకెళ్తారేమోనన్న ఆందోళన శివలో మొదలైంది.
దీంతో ఎలాగైనా బైకును కాపాడుకోవాలని అనుకున్నాడు. బైకును కాపాడుకునేందుకు చైన్స్నాచింగ్లు చేయాలని అనుకున్నాడు. అందు కోసం యూట్యూబ్ చానళ్లను పరీక్షించి చైన్స్నాచింగ్లు పాల్పడే విధానాన్ని తెలుసుకున్నాడు.
హస్తినాపురం, తుల్జాభవానీనగర్లో తండ్రితో కలిసి మేస్త్రి పని కోసం ప్రతి రోజు శివ వెళ్లేవాడు.
తుల్జాభవానీ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న హస్తినాపురం, అనుపమనగర్లో పెబ్బేటి స్వప్న అనే మహిళ పిండిగిర్నితో పాటు కిరాణ షాపు నడుపుతుంది. సదరు మహిళ మెడలో బంగారు పుస్తెల తాడును గమనించాడు. పలు మార్లు ఆ ప్రాంతం నుంచి పర్యటించిన శివ సదరు మహిళ ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించాడు. బైకు ఫైనాన్స్ కట్టేందుకు చైన్స్నాచింగ్ చేయడమే ఏకైక మార్గంగా భావించాడు.
అనుకున్నదే తడవుగా ఈనెల 18న మధ్యహ్నం 3 గంటల సమయంలో స్వప్న అనే మహిళ నడుపుతున్న షాపు వద్దకు వెళ్లి చెక్కీలు కావాలని అడిగాడు. ఆమె చెక్కీలు ఇస్తుండగా మెడలోని పుస్తెలతాడును లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో చివరికి సుమారు ఆరు గ్రాముల పుస్తెలను లాక్కోని వెళ్లిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలలో లభించిన క్లూ ఆధారంగా శనివారం మధ్యహ్నం ఎల్బీనగర్ రింగ్రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శివను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ విషయం బయటపడింది.
నిందితుడైన శివ వద్ద దొంగలించిన పుస్తెలను కొనుగోలు చేసిన వనస్థలిపురం, ఎఫ్సీఐ కాలనీకి చెందిన జువెల్లరీ షాపు యజమాని చేతన్కుమార్ (48)ను అరెస్ట్ చేశారు. నిందితులైన శివ, చేతన్కుమార్లను రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ. 25 వేల విలువైన ఆరు గ్రాముల పుస్తెలు, సెల్ఫోన్, రూ. 3 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.