నిజాంపేట/మెదక్ : చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలోని శౌకత్పల్లి వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ట్రైనీ ఎస్సై లింగరాజు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామానికి చెందిన ఎర్ల కిష్టయ్య (60) గత 8 సంవత్సరాలుగా శౌకత్పల్లి వడ్డెర కాలనీ చెందిన తన అల్లుడు రాములు దగ్గర ఉంటున్నాడు.
ఈ మేరకు మృతుడు కిష్టయ్య బుధవారం రాత్రి నార్లాపూర్, తిప్పనగుల్ల గ్రామాలకు చెందిన హైదర్ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా చెరువు దగ్గర మృతుడు వేసుకున్న బట్టలను గుర్తించి చెరువులో పడినట్లుగా గుర్తించారు.
గురువారం ఉదయం స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతికించగా మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.