నాగర్కర్నూల్ : కట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య లేనిదే తన ఉండలేనని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామకృష్ణ థియేటర్ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రాజ వర్ధన్ (29) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాలతో అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజ వర్ధన్ ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.