అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక్ షాగీర్ (16) ఇద్దరు స్నేహితులు వీరిద్దరు కలిసి అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదివారు.
షాగీర్ మధ్యలో చదువు ఆపేశాడు. ఇబ్రహీం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పదిహేను రోజుల క్రితం ఇబ్రహీం అడ్డగుట్టలోని తన ఇంటికి వచ్చాడు. అయితే షాగీర్ అమ్మాయిలను తరుచు టీజ్ చేస్తున్నాడని తెలిసి ఇబ్రహీం అతన్నిఅలా చేయడం సరికాదని చెప్పాడు.
దీనిపై వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 8న రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ ఇదే విషయమై ఇబ్రహీం, షాగీర్కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షాగీర్ కత్తితో ఇబ్రహీంపై దాడి చేశాడు. ఇబ్రహీంకు ఎడమవైపు కడుపులో, తలపై గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇబ్రహీంని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు షాగీర్పై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. షాగీర్ మైనరు కావడంతో జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.