జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధాన్లోని ఆళ్వార్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదవ తరగతి చదివే బాధితురాలు ఇటీవల కొంతకాలంగా స్కూలుకు వెళ్లకపోవడంతో తండ్రి ప్రశ్నించిన మీదట స్కూల్లో సాగుతున్న అరాచకాన్ని వెల్లడించింది. తనపై టీచర్లు లైంగిక దాడికి పాల్పడుతుంటే ఇద్దరు మహిళా టీచర్లు వీడియో తీశారని బాలిక ఆరోపించింది. ఈ ఘటనపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా ప్రిన్సిపల్, టీచర్లు తమపై లైంగిక దాడులకు పాల్పడి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరు, నాలుగు, మూడో తరగతి చదివే ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితులు బాధితురాళ్లను హెచ్చరించారని తెలిపారు.