చెన్నై : పదిహేను మంది విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో వెలుగుచూసింది. స్కూల్లో బాలల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్ధినులు దాదాపు 15 మంది ఉపాధ్యాయుడి చేతిలో తాము ఎదుర్కొన్న వేధింపులను తెలపడంతో ఈ వ్యవహారం బయటపడింది.
గణితం, సోషల్ సైన్స్ బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు క్లాస్లో ద్వందార్ధ మాటలు ప్రయోగించడం, అభ్యంతరకరంగా తాకడం చేస్తుంటారని, స్కూల్ ముగిసిన తర్వాత ఫోన్ కాల్స్ చేసి వేధిస్తుంటారని విద్యార్ధినులు ఆరోపించారు. విద్యార్ధినుల ఫిర్యాదు ఆధారంగా సోషల్ సైన్స్ టీచర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో టీచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధినుల ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు సాగిస్తున్నారు.