తమిళనాడు: మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి
రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అతడి కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో బాలుడు తప్పిపోయినట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు… గాలింపు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినితో అతడు ప్రేమలో పడినట్లు… అమ్మాయితో కలిసి వెళ్లినట్లు తేలింది. కృష్ణగిరి జిల్లా బేరికై గ్రామం వద్ద ఆ బాలుడు, యువతి కాపురం పెట్టినట్టు తెలుసుకున్న పోలీసులు.. ఇరువురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. మైనర్ బాలుడిని వివాహం చేసుకున్నందుకు గానూ ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం యువతికి వైద్యపరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. బాలుడిని కోర్టు సూచనలతో శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.