అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. పరత్వాడా – బేతుల్ హైవేపై నింభోరా ఫాటా (మళ్లింపు) ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తక్కువ దృశ్యమానత మధ్య ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందారన్నారు. షిరాజ్గావ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన పెట్రోలింగ్ పార్టీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రోడ్డుపై పడి ఉన్న ఎస్యూవీ సీటు పడి ఉండడాన్ని గమనించింది. అందులో గాయపడ్డ వ్యక్తిని కాపాడి.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అచల్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.