బెంగళూర్ : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త కత్తిపోట్లతో ఆమెను కడతేర్చిన ఘటన బెంగళూర్ నగరంలోని చంద్రా లేఅవుట్లో వెలుగుచూసింది. బాధితురాలిని బేబీ ఆయేషా (20)గా పోలీసులు గుర్తించారు. సోమవారం ఈ దారుణం జరగ్గా మంగళవారం నిందితుడు షకీర్ (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేండ్ల కిందట నిందితుడు ఆయేషాను వివాహం చేసకున్నాడు. వీరు తమ ఇద్దరు పిల్లలతో ఆయేషా తల్లితండ్రుల ఇంటిలోనే నివసిస్తున్నారు.
హత్య జరిగిన సమయంలో పిల్లలు అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉన్నారు. మద్యానికి బానిసైన నిందితుడు పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. డబ్బుల కోసం అత్తింటి వారిని షకీర్ వేధింపులకు గురిచేసేవాడని చెప్పారు. ఆయేషా పరాయి మగవాళ్లతో మాట్లాడటం చూస్తే అనుమానంతో షకీర్ ఆమెను తరచూ కొడుతుండేవాడని పోలీసులు తెలిపారు. ఆయేషాపై కత్తితో దాడి చేసే ముందు షకీర్ ఆమెతో ఘర్షణకు దిగాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.