బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవా లంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఓ వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 12లో షేక్పేట మండలం సర్వే నెం 129/52(327) పరిధిలోకి వచ్చే స్థలంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థలం 129/68(పైకి) అనే సర్వే నెంబర్ కిందకు వస్తుందంటూ కొంతమంది నిర్మాణాలు చేస్తుండడంతో సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా యథాతద స్థితి కొనసాగించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ముకుంద్లాల్ బహేతీ అనే వ్యక్తి ప్లాట్ నెంబర్ 81లో నిర్మాణాలు కొనసాగిస్తున్నారని, పనులు ఆపాలంటూ నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ ఏసీపీ రాజ్కుమార్ మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ముకుంద్లాల్ బహేతీపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.