అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి సాధారణ జీవితం గడపడానికి కలుమా నందే లొంగిపోయారని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని అల్లివాగు గ్రామానికి చెందిన సుశీల(20).. శబరి ఏరియా కమాండర్ గీత నిర్వహించిన సమావేశానికి ఆకర్షితురాలై 2019లో దళంలో చేరిందని పేర్కొన్నారు. ఆమెకు శిక్షణ ఇచ్చి ఒక నెలపాటు దళ సభ్యురాలిగా పంపించారని వెల్లడించారు. ఆ తర్వాత ఆమెను టెక్నికల్ టీంకు పంపారని చెప్పారు. అప్పసి నారాయణ రమేశ్ వద్ద ఆరు నెలలు పని చేసిన అనంతరం.. చర్ల ఎల్ఓఎస్లో దళ సభ్యురాలుగా పని చేస్తోందని వివరించారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పించడంతోపాటు ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.