అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంతంలో నివశించే దీపక్ అనే యువకుడు కన్నతల్లి పీక పిసికి చంపేశాడు.
తల్లి కనిపించడం లేదని దీపక్ సోదరి జోస్ మేరీ.. తల్లి కనిపించడం లేదని కేసు పెట్టడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఊళ్లో ఆకుకూరలు అమ్ముతూ బతికే ఫాతిమా మేరీ (50) ఎప్పట్లాగే.. ఆకుకూరలు తీసుకురావడానికి పొలానికి వెళ్లింది. తల్లిని ఇంటికి తీసుకురమ్మని దీపక్(26)ను సోదరి పంపించింది.
పొలం దగ్గరకు వెళ్లిన దీపక్.. తనకు మొబైల్ కొనిపెట్టాలని తల్లితో గొడవ పడ్డాడు. ఆమె దానికి అంగీకరించకపోవడంతో.. చీరకొంగును తల్లి మెడ చుట్టూ చుట్టి పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న రూ.700 తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.
తండ్రి ఆరోగ్యస్వామికి ఫోన్ చేసి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన తల్లి పడిపోయిందని చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం అంగీకరించాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.