హైదరాబాద్ : రెండు రోజుల కిందట మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతదేహం సోమవారం లభ్యమైంది. నెక్నాంపూర్ చెరువులో మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. చెరువులో జేసీబీ సహాయంతో గుర్రపు డెక్క తొలగిస్తున్న క్రమంలో మృతదేహం బయటపడింది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
నగర శివారు పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో శనివారం రాత్రి నిర్మాణంలో డ్రైనేజీ కాలువలో పడిపోవడంతో రజనీకాంత్ కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రెండు రోజులుగా ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. వరద ప్రవాహనానికి మూడు కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకువచ్చింది. రజనీకాంత్ పెరుగు ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోవడంతో కొట్టుకుపోయాడు.