కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ ఆరేండ్ల వయసున్న చిన్నారి.. కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగింది. దీంతో ఆ బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలిని శాన్వికగా పోలీసులు గుర్తించారు.
శాన్విక తల్లిదండ్రులు రాజేశ్, లావణ్య, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పత్తి చేనుకు కొట్టేందుకు రాజేశ్ పురుగుల మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దాంతో ఆ బాలిక ఆడుకుంటూ.. తాగేసింది. శాన్విక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పురుగుల మందును కూల్ డ్రింక్ బాటిల్లో ఉంచడంతోనే.. బాలిక అది కూల్ డ్రింక్ అని భావించి, తాగినట్లు పోలీసుల విచారణలో తేలింది.