సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది చౌరస్తాలో సోమవారం ఆరు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించారు.
పక్కా సమాచారం మేరకు డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6గంటలకు కంది చౌరస్తాలో నిఘా పెట్టారన్నారు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న లారీని ఆపి తనిఖీ చేశారన్నారు. పాత ఇనుప స్క్రాప్ కింద అడుగు భాగంలో ప్లాస్టిక్ సంచుల్లో 6 క్వింటాళ్ల ఎండు గంజాయి ప్యాకెట్ల సంచులు గుర్తించారని ఎస్పీ పేర్కొన్నారు.
లారీ డ్రైవర్ సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేసి, రూరల్ స్టేషన్కు తరలించాం. ఈ గంజాయి విలువ దాదాపు రూ.60లక్షల విలువ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. గంజాయిని తూర్పు గోదావరి జిల్లా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్కు తరలిస్తూ పోలీసులకు చిక్కారన్నారు. ఇందుకు మూల కారకుడైన అనిల్రెడ్డి పరారీలో ఉన్నాడని, అతనిని త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు.
లారీతో సహా దొరికిన డ్రైవర్ గణేశ్ నందకిశోర్ పోట్దార్, మాలెగావ్ గ్రామం, నీలంగా తాలుకాకు చెందిన వ్యాపారి అనిల గోవింద్ కలిముక్లెలను అరెస్టు చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ బాలాజీ నాయక్, రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం, కంది తహసీల్దార్ సతీస్ కుమార్ పాల్గొన్నారు.