అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్రపంచంలో చాలా పాపులర్ ఆటగాడు. పంజాబ్లోనే కాకుండా కెనడా, యూఎస్ఏ, యూకేల్లో కూడా కొన్ని టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు.
కొంతకాలంపాటు కబడ్డీ ప్రపంచాన్ని ఏలాడని సన్నిహితులు అంటున్నారు. అలాంటి సందీప్.. స్థానికంగా జరుగుతున్న ఒక కబడ్డీ కప్లో పాల్గొనేందుకు జలంధర్ చేరుకున్నాడు. ఇక్కడే అతనిపై కాల్పులకు తెగబడిన కొందరు దుండగులు.. 20 రౌండ్లపాటు సందీప్పై కాల్పులు జరిపారు.
అతని తల, ఛాతీ భాగాలే లక్ష్యంగా కాల్పులు జరపడంతో సందీప్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జలంధర్ రూరల్ డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.