ముంబై : పుణేలో దారుణం జరిగింది. సెక్స్ వర్కర్ను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూడు సూట్కేసుల్లో నింపి వాటిని పుణేలోని ముత ఘాట్లో పడవేసిన ఉదంతం కలకలం రేపింది. పదిరోజుల తర్వాత బాధితురాలి శరీర భాగాలను వెలికితీయడంతో మంగళవారం ఈ విషయం వెలుగుచూసింది. సెక్స్ వర్కర్గా పనిచేసే మహిళను ఆమెతో వివాహేతర సంబంధం నెరిపే వ్యక్తి (40) నగరంలోని బుధవార్పేట్లో దారుణంగా హత్య చేశాడు.
నేరాన్ని అంగీకరించిన నిందితుడు మహిళ మృతదేహం భాగాలను నింపిన సూట్కేసుల వద్దకు పోలీసులను తీసుకువెళ్లాడని డీసీపీ శ్రీనివాస్ గడ్గే తెలిపారు. సూట్కేసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన మహిళ ఏడాది కిందట పుణేలోని బుధవార్పేటకు చేరుకుని సెక్స్ వర్కర్గా పనిచేస్తోంది.
నారాయణ పేట్లోని ఫ్లాట్ను ఆమె కోసం నిందితుడు అద్దెకు తీసుకున్నాడు. ఈనెల 12న ఏదో విషయమై నిందితుడు, మహిళకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహిళను ఊపిరిఆడకుండా చేసి హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని అక్కడే ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లాడు. ఆపై బుధవార్ పేట్లోని వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళ కనిపించడంలేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.