ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రి చించ్వాడ్ పోలీసులు ఘరానా దొంగ ఆటకట్టించారు.
నిందితుడిని లఖన్ అశోక్ జెతిధోర్గా గుర్తించిన పోలీసులు అతడి నుంచి ఓ ఎస్యూవీ, 780 గ్రాముల బంగారం, రూ 77 లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన ఇండ్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఓ తినుబండారాల దుకాణం వద్ద నిందితుడు కనిపించగా సీసీటీవీ ఫుటేజ్లోని అనుమానితుడితో పోల్చుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇండ్లలో చోరీల ద్వారా సంపాదించిన మొత్తంతో ఫ్లాట్ కొనుగోలు చేయాలని నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరు జ్యూవెలర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.