లక్నో : తనకు తాను స్వామీజీగా చెప్పుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని గోరఖ్పూర్లో ఈ ఘటన వెలుగుచూసింది. కంపీర్గంజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో వరుసగా ఐదుగురు మరణించడంతో దిక్కుతోచని మహిళలు నకిలీ బాబా శ్యాం బిహారిని ఆశ్రయించారు.
వారిని రాత్రి వేళ పిలిపించిన నిందితుడు వారికి మత్తుమందు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారి కుటుంబానికి పట్టిన చీడను వదిలిస్తానని వారి నుంచి రూ 60,000 వసూలు చేశాడు. తమ ముగ్గురినీ స్వామీజీ లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలుసుకున్న వారు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నకిలీ బాబాను అరెస్ట్ చేశామని గోరఖ్పూర్ ఎస్పీ మనోజ్ అవస్ధి తెలిపారు.