చదువుల దేవాలయం వంటి స్కూల్లో ప్రిన్సిపాల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల విద్యార్థి దుస్తులు విప్పేసి గేలి చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ నీచాన్ని మొబైల్లో వీడియో తీసి వికృతానందం పొందాడు. మిగతా విద్యార్థులు సదరు బాలుడిని ఎగతాళి చేస్తున్నా ఆ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కంప్లయింట్ చేయడంతో ఆ ప్రిన్సిపాల్ను మరో స్కూల్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక మున్సిపల్ స్కూల్లో ఈ నీచానికి పాల్పడిన ప్రిన్సిపాల్ను మరో స్కూల్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత.. దీనిపై స్కూల్ బోర్డు విచారణ చేపట్టింది.
విచారణ అనంతరం అతన్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఒక ఉద్యోగి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన నిందితుడు నిషాంత్ వ్యాస్ పారిపోయాడు. అతనిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో భాగంగా నిషాంత్ ఆచూకీ తెలిసింది. దీంతో వెంటనే అతను ఉన్న ప్రాంతానికి వెళ్లి నిషాంత్ను అదుపులోకి తీసుకున్నారు.