భోపాల్: సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడే పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ పెండ్లి పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న కిలాడీ ముఠా గుట్టును భోపాల్ పోలీసులు రట్టు చేశారు. తమ కుమారుడికి తాము ఎంపిక చేసిన వధువుతో పెండ్లి వేడుక నిర్వహిస్తామని చెప్పి భారీగా డబ్బులు గుంజి తీరా వారు చెప్పిన కోలార్ రోడ్డులోని కళ్యాణ మండపం వద్దకు వెళ్లగా వేదికకు తాళం వేసి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఐదుగురు పెండ్లికుమారుల కుటుంబ సభ్యులు ఇదే తరహా ఫిర్యాదులు చేశారని తెలియడంతో అవాక్కయ్యామని వారు వాపోయారు.
తోడు కోసం అన్వేషిస్తున్న పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ నగరంలో వెడ్డింగ్ రాకెట్ను నిర్వహిస్తున్నారని భోపాల్ పోలీసులు తెలిపారు. ఈ ముఠా పెండ్లికొడుకులకు తగిన వధువులను చూపుతూ పెండ్లి వేడుక నిర్వహిస్తామని భారీగా డబ్బు గుంజుతారని, ఆపై పెండ్లి తేదీ, వేదికను ఖరారు చేసి ఆ సమయానికి టోకరా ఇస్తారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా నిందితులకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ చేశారని, ఆపై మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా వారిని పట్టుకున్నామని తెలిపారు. పెండ్లికుమార్తెగా మోసం చేస్తున్న యువతి సహా ముగ్గురు వెడ్డింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.