బూర్గంపహాడ్ : పశువులను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కంది చేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మర్రికుంట గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..ఖమ్మం డిపోకు చెందిన (TS04 UD 1026) నెంబర్ గల ఆర్టీసీ బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్నది. ఈ క్రమంలో మర్రికుంట గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డుపై ఉన్న పశువులను తప్పించే క్రమంలో రోడ్డు పక్కన గల కంది చేనులోకి దూసుకెళ్లింది. బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా 10 మందికి స్వల్పంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ ఎస్ఐ సముద్రాల జితేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థుల సహాయంతో గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.