మన్సూరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. ఏపీ, గుంటూరు, చెరుకుపల్లి, గుండవల్లికి చెందిన అమరనేని సాంబశివ రావు, కృష్ణకుమారి దంపతుల కుమారుడు నరేన్ దరి (36)కి నాలుగు ఏండ్ల క్రితం యశోదతో వివాహం జరిగింది.
ప్రస్తుతం నరేన్ దరి, యశోద దంపతులు హైదరాబాద్, సైదాబాద్, సరస్వతినగర్, సింగరేణికాలనీలో నివాసముంటు న్నారు. నరేన్ దరి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్)లో ప్రభుత్వ ఉద్యోగి. పని నిమిత్తం నాగర్కర్నూల్ వెళ్లేందుకు గురువారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి ఎల్బీనగర్లోని డీమార్ట్ వైపు ఉన్న మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నాడు.
ఎల్బీనగర్ వార్డు ఆఫీస్ వైపు నిల్చున్న మిత్రుల వద్దకు వెళ్లేందుకు డీ మార్ట్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయం లో ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తున్న సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్29 ఈ 00 29) అతి వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న నరేన్ దరిని డీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నరేన్ దరిని చికిత్స నిమిత్తం కొత్తపేటలోని ఓజోన్ దవాఖానకు తరలించారు.
అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బనావత్ పున్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.