బంజారాహిల్స్,సెప్టెంబర్ 6 : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.2కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాంకోఠిలో నివాసం ఉంటున్న బీరంగంటి సాయిచందర్కు జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో రియల్ ఎస్టేట్ కార్యాలయం ఉంది.
మహమూబ్నగర్ జిల్ల మక్తల్ ప్రాంతానికి చెందిన వ్యాపారి నరేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి ప్రాంతానికి చెందిన సంజీవ్కుమార్లతో ఏడేళ్లుగా సాయిచందర్కు పరిచయం ఉంది.
ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో తమకు తెలిసిన వారి భూములున్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నరేందర్రెడ్డి, సంజీవ్కుమార్లు రెండేళ్లక్రితం నమ్మించారు. దాంతో సాయిందర్ వీరి మాటలు నమ్మి రూ. రూ.2కోట్లదాకా పెట్టుబడులు పెట్టాడు.
అయితే ఏండ్లు గడిచినా పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోగా ఇటీవల ఇదే విషయాన్ని గురించి మాట్లాడేందుకు జూబ్లీహిల్స్లోని సాయిచందర్ కార్యాలయానికి వచ్చిన వారిద్దరూ డబ్బుల గురించి మర్చిపోవాలని, డబ్బుల మాటెత్తితే అంతుచూస్తామని బెదిరింపులకు దిగారు.
ఈ మేరకు బాధితుడు 17వ ఏసీఎంఎం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 406,420,506,156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.