ముంబై : యూట్యూబ్ వీడియోలు చూసి వాటిలో చూపిన విధంగా ఏటీఎంను బద్దలుకొట్టిన దోపిడీ ముఠా రూ 23 లక్షలతో ఉడాయించిన ఉదంతం మహారాష్ట్రలోని పుణే జిల్లా యావత్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏటీఎం దోపిడీకి ప్రధాన సూత్రధారి అజయ్ షెండె (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.
షెండె తన ఇద్దరు అనుచరులు రుషీకేష్ కిర్తికె (22), శివాజీ గరద్ (25)తో కలిసి దోపిడీకి తెగబడ్డాడు. ఏటీఎంను ఎలా బ్రేక్ చేయాలని యూట్యూబ్ వీడియోల ద్వారా వీరు తెలుసుకోవడంతో పాటు దోపిడీ కోసం కొన్ని పరికరాలను కూడా ఈ కామర్స్ వేదికలపై కొనుగోలు చేశారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
యావత్ టౌన్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి వెళ్లిన దోపిడీ ముఠా ఏటీఎం కియోస్క్ సెక్యూరిటీ కెమెరాలను బ్లాక్ చేసింది. ఆపై గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను తెరిచి రూ 23 లక్షలతో పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు తమకు లభించిన ఆధారాలతో షెండెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఓ బైక్, రూ పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.