గువాహటి: అసోంలో ఏటీఎంల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఏటీఎంల దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా రెండు ఏటీఎంలలో భారీ దోపిడీ జరిగింది. ఆ రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లాలో దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండు ఏటీఎంలను దోచుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎం మిషన్లను కత్తిరించి రూ.40 లక్షలతో ఉడాయించారు. దొంగలు పక్కా ప్లాన్తో ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఏటీఎంలోకి ప్రవేశించడానికి ముందు దొంగలు రెక్కీవేసి సీసీ కెమెరా వైర్లను కట్ చేశారని, ఆ తర్వాత ఏటీఎంలోకి చొరబడి షట్టర్ వేసుకుని చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తమ ప్రాథమిక విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఐదు నుంచి ఆరుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం డిస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం చోరీ జరిగింది. కొన్ని రోజుల క్రితం గువాహటి సిటీలో కూడా దుండగులు ఏటీఎంను దోచుకున్నారు.