ఖిలావరంగల్ : చింతల్ ఆర్వోబీపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ బండిపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా భర్త తీవ్రగాయాల పాలయ్యాడు. మిల్స్కాలనీ ఎస్సై బండి హరికృష్ణ కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సట్ల వరలక్ష్మి (55), సట్ల సమ్మయ్య దంపతులు ద్విచక్రవాహనంపై వరంగల్ లేబర్కాలనీలోని తమ బంధువుల ఇంటికి వెళుతున్నారు. చింతల్ ఆర్వోబీపైకి వెళ్లిన తర్వాత వెనకాల నుంచి నర్సంపేట వైపు వెళ్లుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరలక్ష్మీ తలకు తీవ్రగాయాలు అయి అక్కడిక్కడే మృతి చెందగా ఆమె భర్త సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మయ్యను ఎంజీఎం దవాఖానకు తరలించారు. అలాగే విషయం తెలుసుకుని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్, మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా స్తంభించిన వాహనాలను క్రమబద్దీకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరికీ తరలించి ప్రమాదానికి కారణమైన లారీని మిల్స్కాలనీ ఠాణాకు తరలించారు. మృతురాలి కుమారుడు సట్ల రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.