జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ..గట్టు మండల కేంద్రానికి చెందిన మాల నాగరాజు, అలమంచి రాజు, మల్లమ్మ అనే రైతు బతికి ఉండగానే ఆమె చనిపోయిందని నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి రైతు బీమా రూ.5లక్షలు సొమ్మును కాజేశారు.
రాయచూరుకు చెందిన మల్లమ్మ అనే రైతుకు గట్టు మండలంలో భూమి ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న వరుసకు కొడుకైన మాల నాగరాజు మల్లమ్మ చనిపోయిందని గట్టు పంచాయతీ సెక్రటరీ శశిరేఖ కు పట్టా దారు పాస్బుక్,ఆధార్ కార్డు ఇచ్చి మాయమాటలు చెప్పి రైతు బీమా డబ్బులు స్వాహా చేశారని అనేక పుకార్లు వచ్చాయి.
దీంతో స్పందించిన వ్యవసాయ అధికారి భాస్కర్ రెడ్డి గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణ లో మల్లమ్మ బతికి ఉండగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాజేశారని విచారణలో తేలింది. భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశామని తెలిపారు.కేసును సిబ్బందిని ఎస్పీ అభినందించారు.