మాదాపూర్ : అతి వేగమే తన ప్రాణం తీసింది. ద్విచక్ర వాహనంపై స్నేహితున్ని ఎక్కించుకొని నిర్లక్ష్యంతో వేగంగా వస్తుండగా రోడ్డు పై వెళుతున్న స్కూటీని వెనకాల నుండి ఢీ కొట్టి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం … మల్కజ్గిరి, భవాని నగర్లోని సూర్య టవర్స్లో నివాసం ఉంటున్న జె. రాల్ (27) ఓ ప్రైవేట్ సంస్థలో సాష్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4:30 ల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు నాగార్జున (26) తో కలిసి ద్విచక్ర వాహనం (కవాసాకి టీఎస్ 08 ఎఫ్ ఎన్ 9848) పై పర్వత్నగర్ చౌరస్తా నుండి మాదాపూర్ మీదుగా ఆలంఘీర్ మసీద్ దారిలో వెళ్తున్నారు.
అదే మార్గంలో అయ్యప్పసొసైటీకి చెందిన ఎండి నోవమాన్ (23) తన స్నేహితుడు సునీల్ దత్ (23)తో హోండా స్కూటీ (టీఎస్ 33 సి 2711) పై వెళ్తుండగా రాల్ నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనంపై వచ్చి వెనకాల నుండి స్కూటీని ఢీ కొట్టాడు. దీంతో రాల్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు దగ్గరలోని దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాల్ వెనకాల కూర్చున్న వ్యక్తి ఎడమ కాలు, మోకాలు కింద భాగం విరిగి శరీరం నుండి వేరయ్యాయి.
స్కూటీపై వెళుతున్న ఇరువురి కుడి చేయి భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి తన స్నేహితుడితో కలసి నైట్ పార్టీకి వెళ్ళి మద్యం సేవించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేఫథ్యంలో వారి ఇరువురి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.