మంచాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలోని జాపాల-మంచాల గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ఎనుక సత్యనారాయణ (30) శనివారం ఉదయం మోటర్ సైకిల్పై భార్య పిల్లలతో కలిసి మంచాల గ్రామంలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో మంచాల నుంచి సత్యనారాయణ ఒక్కడే స్వగ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలో మోటర్ సైకిల్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదివారం ఉదయం గొర్ల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణకు ఒక్క కుమార్తె, కుమారుడు ఉన్నారు.