శంకర్పల్లి : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించే లోగా ప్రధాన నిందితుడు తప్పించుకున్న సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులందరూ కలిసి మోమిన్పేట్, వికారాబాద్, శంకర్పల్లి ప్రాంతాలలో దారి దోపిడీలకు పాల్పడుతూ, రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేసే వారిపై దాడి చేసి డబ్బులు, సెల్ఫోన్లు లాక్కునే వారు. ఎట్టకేలకు ఎస్ఓటీ, శంకర్పల్లి పోలీసుల కృషితో ఈ దుండగుల బృందాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం వీరిని గురువారం సాయంత్రం కోర్టుకు తరలించగా అక్కడ సమయం మించిపోవడంతో ఉదయం తీసుకురావాలని జైలు అధికారులు తెలిపారు.
దీంతో పోలీసులు శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆరుమంది నిందితుల్లో ప్రధాన నిందితుడు మహ్మద్ హర్షద్ (22) ఉదయం 5 గం.ల సమయంలో టాయిలెట్ అని చెప్పి పోలీసుల కండ్ల కప్పి పరారయ్యాడు. కాగా శుక్రవారం ఉదయం నుంచి చేవేళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి, శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, స్థానిక యువకులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.