హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భద్రాచలం నుంచి ముంబైకి కారులో తరలిస్తున్న 410 కేజీల గంజాయిని కీసర పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న వెంకట నారాయణ(28), దబ్బడి రజనీకాంత్(26), యాచారం నాగరాజు(29)ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్తి బాబు, షాహీన్, మజిద్(ముంబై వాసులు)తో పాటు డి రజనీకాంత్(మేడ్చల్) పరారీలో ఉన్నారు.
భద్రాచలం పరిధిలోని ఓ గ్రామానికి వెంకట నారాయణ, రజనీకాంత్, నాగరాజు వెళ్లి గంజాయిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత సత్తిబాబు అనే వ్యక్తికి కిలో గంజాయిని రూ. 3 వేలకు విక్రయించారు. అనంతరం గంజాయిని ముంబైకి తరలిస్తుండగా కీసర వద్ద ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మజిద్, సాహీన్కు కిలో గంజాయిని రూ. 12 వేలకు సత్తిబాబు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.