ముంబై : సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రూటు మార్చి పార్ట్టైం జాబ్ ఆఫర్ల పేరుతో ఆన్లైన్ వేదికగా అందినకాడికి దోచుకుంటున్నారు. యూట్యూబ్లో మూవీలకు రేటింగ్లు ఇవ్వడం ద్వారా పెద్దమొత్తంలో సంపాదించవచ్చని అమాయకులకు ఎరవేసిన కేటుగాళ్లు తాజాగా పార్ట్టైం జాబ్ పేరుతో పుణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 96 లక్షలు కాజేశారు. పుణే సిటీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు ఇటీవల ఆన్లైన్లో బాధితులను నిండా ముంచుతున్నారు.
తాజా ఘటనలో పుణేకు చెందిన 56 ఏండ్ల అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ మేకర్ను సైబర్ నేరగాళ్లు గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 5 మధ్య ఏకంగా దాదాపు రూ. కోటి వరకూ మోసం చేశారు. రాంబాగ్ కాలనీకి చెందిన బాధితుడు తన ఫోన్ నెంబర్కు పార్ట్టైం జాబ్ ఆఫర్తో వచ్చిన టెక్ట్స్ మెసేజ్కు స్పందించాడు. చాట్ యాప్లో జాయిన్ కావాలని అతడిని ఆహ్వానించారు. బాధితుడు జాబ్ చేసేందుకు అంగీకరించడంతో అతడి నమ్మకాన్ని చూరగొనేందుకు స్కామర్లు వెల్కం బోనస్ కింద రూ. 10,000 చెల్లించారు. ట్రావెల్ ఏజెన్సీకి రేటింగ్ ఇవ్వడం ద్వారా మెరుగైన రిటన్స్ అందిస్తామని నమ్మబలికారు.
ఆపై ఆకర్షణీయ రిటన్స్ కోసం కొన్ని ప్రీ పెయిడ్ టాస్క్లు పూర్తిచేయాలని కోరారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పలుమార్లు పెద్దమొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. స్కామర్లు మరింత మొత్తం డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. లక్ష లోపు టాస్క్లకు డబ్బు చెల్లించిన స్కామర్లు బాధితుడికి రూ. లక్ష చెల్లించాల్సిన క్రమంలో రూ. 32 లక్షలు తమకు ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం డబ్బును, కమీషన్, రిటన్స్తో చెల్లిస్తామని నమ్మబలికారు. ఆపై మరో రూ . 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్న అనంతరం పదేపదే డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More